కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో విషాదం
భార్య మరణించిన కొద్ది రోజుల్లోనే SI ఆత్మహత్య
అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులు
శ్రీ బల భీమా న్యూస్ ప్రతినిధి – హైదరాబాద్

కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో విషాదం చోటు చేసుకుంది. కరీంనగర్ టూ టౌన్ ఎస్సైగా పనిచేస్తున్న చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. చంద్రశేఖర్ భార్య ఈనెల 16న సూసైడ్ చేసుకోగా.. ఐదు రోజుల వ్యవధి లోనే ఎస్సై చంద్రశేఖర్ సైతం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. కారణం ఏంటో తెలియదు కానీ.. మొదట SI సతీమణి దివ్య సూసైడ్ చేసుకుంది. విషపూరితమైన గన్నేరు పప్పు తిని ఆత్మహత్యకు ప్రయత్నించగా విషయం గమనించిన కుటుంబసభ్యులు కరీంనగర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కొల్పోయింది . గత కొంతకాలంగా దివ్య కడుపునొప్పితో బాధపడుతుందని ఆ నొప్పిని భరించలేకనే సూసైడ్ చేసుకున్న తెలిసింది.

అయితే దివ్య అంత్యక్రియల సమయంలో కొందరు గ్రామస్థులు, బంధువులు చంద్రశేఖర్పై దాడికి ప్రయత్నించారు. దివ్య మరణానికి ఆయనే కారణమని ఆరోపించారు. ఆ సమయంలో దివ్య తల్లిదండ్రులే అల్లుడిని కాపాడినప్పటికీ, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య లేదన్న బాధ, సమాజం వేలెత్తి చూపుతుందన్న అవమానం ఆయనను వెంటాడాయి. భార్య చనిపోయిన ఐదో రోజు కార్యక్రమం కోసం చంద్రశేఖర్ ఇల్లందుకుంట మండలం సీతంపేటలోని తన అత్తగారింటికి వెళ్లారు. భార్య మరణాన్ని జీర్ణించుకోలేక, మరోవైపు బంధువుల నుంచి ఎదురైన విమర్శలతో ఎస్సై చంద్రశేఖర్ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. అక్కడ భార్య జ్ఞాపకాలు ఆయనను మరింత కలచివేశాయి. అందరూ ఇంట్లోనే ఉండగా.. ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు . ఎంతసేపటికీ గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే ఆయన అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే జమ్మికుంటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.



