- 30 నుంచి 70 ఏళ్ల వయస్సు గల వారికి ఇంటింటా ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్, ఆగస్టు 6 :
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల పరిధిలోని పెద్ద నందిగామ గ్రామంలో గ్రామ సర్పంచ్ చెన్ బాస్ కుమార్ ఆధ్వర్యంలో ఇండియా క్యాన్సర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఇండియా క్యాన్సర్ ఆర్గనైజేషన్ ప్రతినిధి భగీరత్ రెడ్డి, అంగడి రాయచూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ బుశ్రా పాల్గొని ప్రజలకు ఆరోగ్యంపై పలు సూచనలు చేశారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి 30 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు, పురుషులకు ఉచిత ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్), రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వికల్ క్యాన్సర్) వంటి వ్యాధులను ముందస్తుగా గుర్తించేందుకు ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ పరీక్షల ద్వారా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. గ్రామ ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైద్య బృందానికి పూర్తి సహకారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి డేవిడ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, ఆశా వర్కర్లు, గ్రామ ఆరోగ్య సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


