- గన్నీ సంచుల కొరత, ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ నేతలు
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :
దౌల్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన “రైతు మహా ధర్నా” కార్యక్రమం రాజకీయంగా ఉద్రిక్తతలకు దారి తీసింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొని రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోనే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచుల కొరత, తూకాల్లో భారీ తరుగు, అదనపు వసూళ్లు వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. “రైతులు గన్నీ సంచులు అడగడానికి వెళ్తే డబ్బులు తీసుకుని సంచులు ఇస్తున్నారు. పరిగి నుంచి కొడంగల్ వరకు రైతులు రోడ్లపైనే ధాన్యాన్ని ఉంచుకుని వర్షాల్లో తడుస్తున్నారు. ఇది రైతు పాలన కాదని ప్రజలు గ్రహించాలి” అంటూ ఆమె మండిపడ్డారు.
ధాన్యం తూకం వేస్తున్న సమయంలో ప్రతి క్వింటాకు 10 నుంచి 13 కిలోల వరకు తరుగు తీస్తున్నారని రైతులు తమ వద్దకు వచ్చి వాపోయారని తెలిపారు. “ఒకవైపు గన్నీ బ్యాగుల కోసం డబ్బులు చెల్లించాలి, మరోవైపు వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోవాలి. దీనికి తోడు అమలి ఛార్జీల పేరుతో ఒక్కో సంచికి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు ఎలా బతుకుతారు?” అని ప్రశ్నించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదని పేర్కొంటూ మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావు పాలనను సబితా ఇంద్రారెడ్డి ప్రశంసించారు. “కేసీఆర్ సభలు పెడితే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అయ్యేవి. వర్షపు చినుకులు పడితే రైతుల గురించి ఆలోచించి సాయం చేసేవారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా రైతులను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు” అని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం మాత్రం ఓట్ల రాజకీయాలు చూసి రైతు బంధు అమలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. “రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల పట్ల వివక్ష పెరిగింది. పార్టీలను చూసి వడ్లు కొనుగోలు చేసే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. సీఎం సొంత నియోజకవర్గంలోనే గన్నీ సంచులు అందించలేకపోతే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలి” అని తీవ్ర విమర్శలు గుప్పించారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంలో తాలు ఉందని చెప్పి ప్రతి క్వింటాకు 10 కిలోల వరకు కోత విధించడం రైతులకు భారీ నష్టమని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. రైతులు పండించిన పంటకు సరైన ధర రావడం లేదని, ప్రభుత్వం సమయానికి కొనుగోళ్లు చేపట్టకపోవడం వల్ల రైతులు ఆర్థికంగా కుంగిపోతున్నారని అన్నారు.
రెండు రోజుల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని, వెంటనే సరిపడ గన్నీ సంచులు సరఫరా చేసి కొనుగోళ్లు వేగవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. “ప్రభుత్వం ఇలాగే కాలయాపన చేస్తే రైతులు తమ ధాన్యాన్ని సీఎం సెక్రటేరియట్కు తీసుకువచ్చే పరిస్థితి వస్తుంది” అని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
దౌల్తాబాద్, బొంరాస్పేట్ మండలాల్లో కనీస సౌకర్యాలు కూడా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆరోపించారు. వర్షాల కారణంగా రోడ్లపైనే ధాన్యం నిల్వ ఉండటంతో నాణ్యత దెబ్బతింటోందని, రైతుల కష్టం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. “రైతుల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుంది. రాబోయే రోజుల్లో రైతు రాజ్యం తిరిగి వస్తుంది” అంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



