- “ఇందిరమ్మ ఒక తరం అయితే… ఎన్టీఆర్ ఒక శకం”
- “2034 వరకు ప్రజా ప్రభుత్వానిదే అధికారం” అంటూ ధీమా వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :
హైదరాబాద్: తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్టీఆర్ దేశం గర్వించదగ్గ మహానేత అని కొనియాడారు.
“తెలుగు జాతి అన్నా అని పిలుచుకునే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. దేశ చరిత్ర నుంచి ఎవరు స్ఫూర్తి పొందాలన్నా ముగ్గురు జాతి రత్నాలను తప్పక తలచుకోవాలి” అని సీఎం పేర్కొన్నారు.
మొదటగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను స్మరించుకోవాలని, పేదలకు ఓటు హక్కు కల్పించి సమానత్వానికి మార్గం చూపిన మహనీయుడు ఆయనే అని అన్నారు. అనంతరం భూ సంస్కరణలు తీసుకువచ్చి పేదలకు హక్కులు కల్పించిన ఇందిరా గాంధీని గుర్తుచేశారు. అదే విధంగా నీతి, నిజాయితీ, ఉక్కు సంకల్పానికి ప్రతిరూపమైన ఎన్టీఆర్ను ప్రజలు ఎప్పటికీ మరువలేరని వ్యాఖ్యానించారు.
“ఎన్టీఆర్ రాజకీయాలకు అతీతమైన స్ఫూర్తి”
కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై కొందరు విమర్శలు చేస్తున్నారని సీఎం అన్నారు. “ఎన్టీఆర్ కేవలం ఒక పార్టీకి చెందిన నాయకుడు కాదు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా జాతి గర్వించదగ్గ నాయకుడు. ఇది కేవలం విగ్రహం మాత్రమే కాదు… రాజకీయాలకు అతీతమైన స్ఫూర్తి” అని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ తన రాజకీయ ప్రస్థానంలో తెలంగాణకు ఎందరో నాయకులను అందించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులు వంటి నేతలను రాష్ట్ర రాజకీయాలకు పరిచయం చేసిన ఘనత ఎన్టీఆర్దేనని అన్నారు. అంతేకాకుండా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కూడా గుర్తించి నాయకుడిగా తీర్చిదిద్దింది ఎన్టీఆర్నే అని వ్యాఖ్యానించారు.
“ఆయన పేరు పెట్టుకున్న వాళ్లు కూడా ఇప్పుడు ఆయన విగ్రహాన్ని విమర్శించడం బాధాకరం. కొందరు నకిలీ నాయకుల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అంటూ సీఎం ఘాటుగా స్పందించారు.

సంక్షేమ పథకాల వెనుక ఎన్టీఆర్ స్ఫూర్తి
పేదల కోసం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ.2 కిలో బియ్యం పథకం దేశ రాజకీయాల్లో సంక్షేమానికి కొత్త దిశను చూపిందని సీఎం తెలిపారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వెనుక కూడా అన్నగారి స్ఫూర్తి ఉందని చెప్పారు.
“సన్నబియ్యం అందించే కార్యక్రమం వెనుక అన్నగారి ఆలోచన ఉంది. ఆడబిడ్డలకు చీరలు, సంక్షేమ పథకాలు అందించడంలో కూడా ఎన్టీఆర్ స్ఫూర్తి కనిపిస్తుంది. బలహీన వర్గాలు పాలకులుగా ఎదగడంలో ఆయన చేసిన కృషి అపారమైనది” అని కొనియాడారు.
పటేల్-పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పేదలకు ఆత్మగౌరవంతో జీవించే అవకాశాన్ని కల్పించిన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.
“మా ప్రభుత్వ నిర్ణయాల్లో ఇందిరమ్మ, ఎన్టీఆర్ స్ఫూర్తి”
“మా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో ఇందిరమ్మ, ఎన్టీఆర్ స్ఫూర్తి కనిపిస్తుంది. ఇందిరమ్మ ఒక తరం అయితే… ఎన్టీఆర్ ఒక శకం” అని సీఎం భావోద్వేగంగా పేర్కొన్నారు.
ఆ ఇద్దరు మహానేతల ఆలోచనలతోనే ప్రజా పాలన అందిస్తున్నామని, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు.
రైతును రాజును చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించిన సీఎం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు.
మహిళల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు
రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించగా, వాటిని సమర్థంగా అమలు చేసిన ఘనత ఎన్టీఆర్దేనని సీఎం గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో తమ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు.
“మహిళల కోసం ఇప్పటికే రూ.60 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం. నిరుపేదలకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నాం” అని వెల్లడించారు.
“65 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం”
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 65 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
ఉపఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మద్దతు వల్లే ప్రజా పాలన ముందుకు సాగుతోందని, భవిష్యత్తులో కూడా ఇదే సహకారం కొనసాగించాలని కోరారు.
“2034 వరకు ప్రజా ప్రభుత్వానిదే అధికారం” అంటూ ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతాం
హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని సీఎం తెలిపారు. ఈ క్రమంలోనే 30 వేల ఎకరాల్లో “భారత్ ఫ్యూచర్ సిటీ”ని నిర్మించబోతున్నామని ప్రకటించారు.
ప్రపంచ దిగ్గజ కంపెనీలను తెలంగాణకు తీసుకువచ్చి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జయజయధ్వానాలతో సభ ప్రాంగణం మార్మోగిపోయింది.




