కొడంగల్‌పై కవిత ఫోకస్

  • ఈనెల 23న కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ
  • పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

శ్రీ బల భీమ న్యూస్ / హైదరాబాద్ (సెప్టెంబర్ 6) :

సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 23న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో కవిత ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి.. కనీసం సగం హామీలను కూడా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బూటకపు హామీలు, బోగస్ మాటలపై కొడంగల్ కేంద్రంగా పాంచజన్య శంఖారావం పూరిస్తున్నామని కవిత పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడంతో పాటు ‘పాంచజన్య’లో ప్రకటించిన ప్రతి హామీని వంద శాతం అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

యువత, మహిళలు, సబ్బండ వర్గాల వికాసం, సాధికారతతో కూడిన బహుజన తెలంగాణను సాకారం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని కవిత తెలిపారు.

తెలంగాణ రక్షణ సేనలోకి బీజేపీ కొడంగల్ నాయకుడు

కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయంగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ కొడంగల్ నాయకుడు ఇన్‌చార్జి ప్రభాకర్ కులకర్ణి తెలంగాణ రక్షణ సేనలో చేరారు.

ఆదివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత.. ప్రభాకర్ కులకర్ణితో పాటు ఆయన అనుచరులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ప్రభాకర్ కులకర్ణి మాట్లాడుతూ.. కవిత నాయకత్వంలో బహుజన తెలంగాణ సాధన కోసం తాను తెలంగాణ రక్షణ సేనలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అర్చనా సేనాపతి, గవినోళ్ల శ్రీనివాస్, సయ్యద్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles